టైగర్‌ మ్యాన్‌ వాల్మీక్‌ థాపర్‌ కన్నుమూత

Telugu Lo Computer
0


టైగర్‌ మ్యాన్‌గా ప్రసిద్ది చెందిన పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్‌ థాపర్ శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్‌ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150 కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్‌తో కలిసి పనిచేశారు. వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (1997) టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలును రచించారు. ఆయన సహ నిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలు, చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల బీబీసీ సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997) బాగా పాపులర్‌. 2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు. వాల్మీక్‌ థాపర్ బొంబాయిలో రాజ్- రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్‌ను వివాహం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)