కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఆయన ఒక ప్రతిపాదనను సమర్పించారు. 2025 జనవరిలో సదరు మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఈ ప్రతిపాదన కింద 20 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లు లభిస్తాయి. అలాగే, బీసీ గృహాలకు కిలోవాట్కు ₹10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29 లో భాగంగా అదనంగా 72.6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని, ఇందులో 40 గిగావాట్ల సౌరశక్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సామాన్యులకు సైతం సౌరశక్తిని అందుబాటులోకి తీసుకు వస్తుంది. ప్రతిపాదిత యుటిలిటీ-నేతృత్వంలోని రూఫ్టాప్ మోడల్ ఏపీ విద్యుత్ కొనుగోలు వ్యయాలను తగ్గించడంతో పాటు, బలహీన వర్గాలకు సాధికారత కల్పిస్తుంది. అలాగే ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుంది. కేంద్రం సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి మునుముందు మార్గనిర్దేశం చేయగలదని, ఒక బెంచ్మార్క్ను నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
May 23, 2025
0
Tags