మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని, దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్కు అండగా నిలిచిందని.. పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భారోసా ఇచ్చారు. “కశ్మీర్లో శాంతి తిరిగి నెలకొంటోంది. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. శత్రువులకు ఇది నచ్చడం లేదు. ఉగ్రవాద నాయకులు కశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ సవాలును ధీటుగా ఎదుర్కోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాం.” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అనంతరం.. ఇస్రో మాజీ చీఫ్, శాస్త్రవేత్త కె. కస్తూరిరంగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కస్తూరిరంగన్ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమని స్పష్టం చేశారు.
పహల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది : నరేంద్ర మోడీ
April 27, 2025
0
Tags