మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌ కాంట్రాక్ట్‌ !

Telugu Lo Computer
0


హీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్‌పీఎల్) ఎయిర్‌బస్ నుంచి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును పొందింది. ఎయిర్‌బస్‌కు చెందిన హెచ్ 130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్‌ తయారీ, అసెంబుల్‌ కాంట్రాక్టును దక్కించుకుంది.  ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ కార్యదర్శి వుమ్‌లన్‌మాంగ్ వుల్నామ్, భారత్‌, దక్షిణాసియాలో ఎయిర్‌బస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్ 130 హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్‌ అసెంబ్లీని మహీంద్రా ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐరోపాలోని ఎయిర్ బస్ హెలికాప్టర్ల కేంద్రానికి రవాణా చేస్తారు. ఉత్పత్తి వెంటనే ప్రారంభం కానుంది. మొదటి క్యాబిన్ అసెంబ్లీ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది. మహీంద్రా ఇప్పటికే ఎయిర్ బస్ వాణిజ్య విమాన కార్యక్రమాల కోసం వివిధ రకాల విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్ లను సరఫరా చేస్తోంది. విడిభాగాలు, సబ్‌-అసెంబ్లింగ్‌లే కాకుండా భారీ, మరింత సంక్లిష్టమైన ఏరో స్ట్రక్చర్ తయారీ, సరఫరాకు మహీంద్రా తన సామర్థ్యాల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్న క్రమంలో తాజా ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఎయిర్ బస్ కు భారత్ ప్రధాన మార్కెట్‌, వ్యూహాత్మక వనరుల కేంద్రంగా ఉంది. ప్రతి ఎయిర్ బస్ వాణిజ్య విమానంలోనూ భారతదేశంలో తయారైన విడిభాగాలు, సాంకేతికతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ బస్ భారత్ నుంచి విడిభాగాలు, సేవల కొనుగోలు విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది. హెచ్ 130 అనేది ప్రయాణికుల రవాణా, పర్యాటకం, ప్రైవేట్, వ్యాపార విమానయానం, అలాగే మెడికల్ ఎయిర్ లిఫ్ట్, నిఘా మిషన్ల కోసం రూపొందించిన ఇంటర్మీడియట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో విశాలమైన, అడ్డంకులు లేని క్యాబిన్ ఉంటుంది. పైలట్, మరో ఏడుగురు ఇందులో ప్రయాణించవచ్చు. చుట్టూ పెద్ద విండ్ స్క్రీన్, వెడల్పాటి కిటికీల ద్వారా అద్భుతమైన విజిబిలిటీ ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)