గాజాకు వెళ్లే అంతర్జాతీయ మానవతా సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ !

Telugu Lo Computer
0


గాజాకు పంపే మానవతా సహాయాన్ని అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ఇకపై గాజాలోకి ఎటువంటి వస్తువులను అనుమతించదని ఇజ్రెయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సమయంలో ఈ నిర్ణయం వచ్చింది. దీనికి కారణం కాల్పుల విరమణను పొడిగించడానికి హమాస్ నిరాకరించడమేనని, ఇజ్రాయెల్ తన బందీలను విడుదల చేయకుండా పూర్తి స్థాయి కాల్పుల విరమణను అనుమతించదని ప్రధాన మంత్రి నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణను పొడిగించాలన్న అమెరికా ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగిసింది. ఇటీవల ఈజిప్టు, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో మానవతా సహాయం పెరిగింది. ఈ క్రమంలోనే రంజాన్ సందర్భంగా తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ ప్రతిపాదించారు. దీనిలో భాగంగా హమాస్ తమ ఆధీనంలోని పలువురు బందీలను విడుదల చేయాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీనికి హమాస్ నిరాకరించడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)