తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందని, డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయమని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు, కళాశాలల యాజమాన్యాల పట్ల మీ తీరు దుర్మార్గమని మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని, కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించిందని వాపోయారు. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటన్నారు. నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలని సవాల్ చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలని కోరారు. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కిషన్రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు : కిషన్ రెడ్డి
February 24, 2025
0
Tags