కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'పేద మహిళ' అని అభివర్ణించినందుకు బీహార్లోని ముజఫర్పూర్లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది. ఈ కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ 'చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది' అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
సోనియా గాంధీపై కేసు నమోదు !
February 02, 2025
0
Tags