భారత్కు అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ''అమెరికా-భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సమీప భవిష్యత్తులోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని ట్రంప్ వెల్లడించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. ''ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపైనా దృష్టిపెడతాం. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం'' అని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలపైనా మోడీ మాట్లాడుతూ ''యుద్ధం విషయంలో భారత్ది తటస్థ వైఖరి కాదు. మేం శాంతి వైపు నిలబడతాం. ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పా. ఉద్రిక్తతలను ఆపడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నా'' అని మోడీ వెల్లడించారు. ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. దీనినుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా 'మేక్ ఇండియా గ్రేట్ అగైన్' నినాదం ఇస్తున్నట్లు మోడీ ఈ సందర్భంగా తెలిపారు. MAGA, MIGA కలిస్తే 'మెగా' భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
భారత్కు ఎఫ్-35 యుద్ధ విమానాలు !
February 14, 2025
0
Tags