తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రూ.21వేల కోట్లు విద్యాశాఖ కోసం కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొగిలిగిద్దకు దాదాపు రూ.16 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ''గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు జరగలేదు. మా ప్రభుత్వం రాగానే 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల తరబడి నియామక ప్రక్రియ జరిగేది. మా ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్లక్ష్యం చేసింది. భారాస హయాంలో వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి. మా ప్రభుత్వం రాగానే వీసీలను నియమించాం. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాం. 21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించాం. ఎలాంటి వివాదం లేకుండా 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాం. ఎందరో ప్రముఖులు మొగిలిగిద్ద పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్యపై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్పై పెట్టుబడి. విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకొని నిత్యం పర్యవేక్షిస్తున్నా'' అని సీఎం తెలిపారు.
విద్యపై చేసేది ఖర్చు కాదు - భవిష్యత్ పెట్టుబడి : సీఎం రేవంత్రెడ్డి
January 31, 2025
0
Tags