భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే అందిస్తున్న రెండు రీఛార్జి ప్లాన్లపై ఇచ్చే డేటా ప్రయోజనాలను తొలగించింది. వాయిస్, ఎస్సెమ్మెస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ రూ.509 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ రీఛార్జితో అన్లిమిటెడ్ వాయిస్కాల్స్, 900 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. ఇక రూ.1,999 రీఛార్జి ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ రెండు రీఛార్జి ప్లాన్లపై ఇంతకు ముందు డేటా కూడా అందించేది. తాజాగా ఆ సదుపాయాన్ని తొలగించింది. అయితే, దీనిపై ఎయిర్టెల్ వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ గందరగోళం నెలకొందని పేర్కొంది. సంబంధిత ప్లాన్లను వెబ్సైట్ నుంచి తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్సెమ్మెస్తో పాటు డేటా కలగలిపిన ప్లాన్లు అందిస్తున్నాయి. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాయిస్, ఎస్సెమ్మెస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తాజాగా ఆదేశించింది. స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ రెండు రీఛార్జి ప్లాన్లలో డేటా ప్రయోజనాలు తొలగించింది. ప్రస్తుతానికి ఈ రెండు ప్లాన్లు వెబ్సైట్లో అందుబాటులో లేవు.
రెండు ప్లాన్లపై డేటా ప్రయోజనాలను తొలగించిన ఎయిర్టెల్ !
January 22, 2025
0
Tags