తెలంగాణలో రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూ భారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువరించింది. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతుభరోసాకు అర్హులు అని ప్రకటించింది. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతుభరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతుభరోసా పథకం వ్యవసాయశాఖ సంచాలకులు ద్వారా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఎన్ఐసీ, ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది. జిల్లా కలెక్టర్లకు పథకం అమలు ఫిర్యాదుల పరిష్కరణ బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయశాఖ సంచాలకుల తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తెలంగాణలో రైతు భరోసాకు మార్గదర్శకాలు జారీ !
January 12, 2025
0
Tags