కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి కేసులో సంజయ్‌రాయ్‌ని దోషిగా తేల్చిన కోర్టు !

Telugu Lo Computer
0


తేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ని దోషిగా నిర్ధారిస్తూ సిల్దా కోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌కి సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసుపై గతేడాది నవంబర్‌ 12నుంచి సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణలో భాగంగా దాదాపు 100 మందికి పైగా సాక్షులను విచారించింది. అత్యంత వేగంగా కేసు విచారణ పూర్తి చేసిన కోర్టు తుది తీర్పు వెలువరించడం గమనార్హం. గతేడాది ఆగస్ట్‌ 9న ఆర్జీకార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై హత్యాచారం ఘటన జరిగింది. ఈ కేసు విషయమై 50 మంది సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది. దీంతో, ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. రెండు నెలల పాటు విచారణ జరిపిన సిల్దా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉండగా ఈ కేసుపై కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించడం సహా ఆర్జీకార్‌ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌తో పాటు పలువురిని సీబీఐ ప్రశ్నించింది. అయితే.. ఈ ఘటనకు నిరసనగా ఆర్జీకార్‌ హాస్పిటల్‌లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌ను హైకోర్టు తీవ్రంగా మందలించింది. మరోవైపు డాక్టర్‌పై హత్యాచార ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ క్రమంలోనే ర్యాలీ నిర్వహించారు సీఎం మమతా బెనర్జీ.. హత్యాచారం కేసులో నిందితులను ఉరితీయాలన్నారు. కొందరు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సంచలనం రేపిన డాక్టర్‌ హత్యాచారం కేసులో నివేదిక ఇచ్చిన సీబీఐ.. నిందితుడికి మరణ శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. సీబీఐ సిఫార్సు చేసినట్టుగా నిందితుడు సంజయ్‌ రాయ్‌కు మరణ శిక్ష ఖాయమా? మరికొందరి ప్రమేయం కూడా వుందన్న డాక్టర్‌ అభయ పేరెంట్స్‌ ఫిర్యాదు కీలకంగా మారనుందా? హత్యాచారం కేసు సహా ఆర్జీకార్‌లో అక్రమాలపై కూడా సిల్దా కోర్టు సంచలన తీర్పు ఇవ్వనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)