ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఎనిమిది దేశాలు తలపడే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 మందితో కూడిన టీమ్ను వెల్లడించారు. ఏమైనా మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. అంతకుముందు వాంఖడే మైదానంలోనే దాదాపు రెండున్నరగంటలకుపైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. శుక్రవారమే తన నివేదికను సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కూ ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న, పాక్తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్తో మార్చి 2న టీమ్ఇండియా దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. దాయాది దేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమ్ఇండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది.
జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్.