జైశంకర్‌ను ప్రశంసించిన రష్యావిదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ !

Telugu Lo Computer
0


భారత్‌ ఎప్పటికీ తమ చిరకాల మిత్ర దేశమేనని రష్యా మరోసారి ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు అంశంలో యూరోప్‌ నేతల నుంచి వచ్చిన విమర్శలను భారత్‌ తిప్పికొట్టిన తీరును గుర్తు చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌ సమర్థతను ప్రశంసించారు. సోచిలో జరిగిన వరల్డ్‌ యూత్‌ ఫోరమ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు లావ్రోవ్‌ బదులిచ్చారు. రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నాడు యూరోప్‌ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఏ దేశం కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదంటూ ప్రకటించాయి. అయినప్పటికీ రష్యాతో భారత్‌ చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఈ అంశంపై తలెత్తిన ప్రశ్నకు లావ్రోవ్‌ స్పందించారు. ''యుద్ధసమయంలో ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో నా స్నేహితుడు, భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ ప్రసంగించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎందుకు ప్రారంభించారని పశ్చిమ దేశ నేతలంతా ఆయన్ను ప్రశ్నించారు. 'మీ పని మీరు చూసుకోండి' అంటూ అక్కడున్న వారికి జైశంకర్‌ సూచించారు. ఇక అప్పటి నుంచి పాశ్చాత దేశాలు సైతం రష్యా నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి. ఇది జాతీయ గౌరవం'' అంటూ లావ్రోవ్‌ గుర్తు చేసుకున్నారు. మాస్కో దండయాత్ర కారణంగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ భారత్‌ చమురు దిగుమతి చేసుకోవడం రష్యాకు అనుకూల అంశం. 2022-2023 మధ్య రోజుకు 1.27 మిలియన్‌ బ్యారెళ్ల చమురు దిగుమతులు జరిగాయి. భారత్‌కు అప్పటివరకు గల్ఫ్‌దేశాల నుంచి చమురు దిగుమతులు ఉండగా వాటిని అధిగమించి రష్యా అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)