హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న భీకర దాడులను ఇరాన్ మరోసారి ఖండించింది. పాలస్తీనీయులపై అన్యాయంగా పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్ను ఒంటరి చేయాలని ఈ సందర్భంగా ఓఐసీ దేశాలను కోరింది. ఆ దేశానికి తక్షణమే నిత్యావసర ఎగుమతులను నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. ''గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తక్షణమే ఆపించాలి. ఇందుకోసం ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేలా ఆ దేశానికి చమురు, ఆహార ఎగుమతులను నిలిపివేయాలి'' అని ఖమేనీ ఓ ప్రసంగంలో పలు దేశాలను కోరినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఇరాన్.. గతంలోనూ ఇలాంటి డిమాండ్లు చేసింది. ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సభ్య దేశాలను కోరింది. ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా తెంచుకోవాలని పిలుపునిచ్చింది. గాజాలోని హమాస్తోపాటు లెబనాన్లోని హిజ్బుల్లాకు ఇరాన్ ప్రధాన మద్దతుదారు. దొంగచాటుగా ఆ సంస్థలకు నిధులు, ఆయుధాలను సరఫరా చేస్తోందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబరు 7 నాటి దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయెల్ బలంగా ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలు ఖండించిన ఇరాన్.. గాజాలో ఐడీఎఫ్ దాడులను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పలుమార్లు హెచ్చరించింది.
ఇజ్రాయెల్కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి !
November 01, 2023
0
Tags