రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ భారీ దాడులు

Telugu Lo Computer
0


రష్యా వాయుసేన ఆస్తులపై భారీస్థాయిలో విధ్వంసకర దాడులు చేశామని ఉక్రెయిన్‌ మంగళవారం ప్రకటించింది. మరోవైపు, అమెరికాలో వ్యక్తిగత వివరాలు తెలిపేందుకు నిరాకరించిన ఓ అధికారి ఉక్రెయిన్‌ కొన్ని నెలలుగా పదేపదే అడుగున్న దీర్ఘశ్రేణి క్షిపణులను ఆ దేశానికి చడీచప్పుడు లేకుండా అందజేశామని, ప్రస్తుతం అవి యుద్ధక్షేత్రంలో ఉన్నాయని వెల్లడించారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలపై రాత్రిపూట జరిపిన దాడుల్లో రెండు స్థావరాల్లో తొమ్మిది హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ బలగాలు ప్రకటించాయి. సైనిక పరికరాలు, గగనతల రక్షణ వ్యవస్థ, ఆయుధగారం, రన్‌వేలను సైతం ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. ఆపరేషన్‌ డ్రాగన్‌ ఫ్లై సంకేత నామంతో నిర్వహించిన ఈ దాడుల్లో డజన్ల కొద్దీ రష్యా సైనికులు గాయపడినట్లు వెల్లడించాయి. మరోవైపు, అమెరికాలోని ఓ అధికారి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు 'ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌ (ఏటీఏసీఎంఎస్‌)లు సరఫరా చేశామని చెప్పారు. గత నెల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ విషయమై హామీ ఇచ్చారన్నారు. ఈ క్షిపణుల్లోని కొన్ని రకాలు 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలవని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)