జంతువుల అవయవాలతో మానవులకు జీవం పోయవచ్చని న్యూయార్క్ పరిశోధకులు వెల్లడించారు. జన్యు మార్పిడి చేసిన జంతువు కిడ్నీని బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తికి మార్పిడి చేసి విజయవంతంగా పరీక్షించినట్టు వారు తెలిపారు. నెల రోజులకుపైగా కిడ్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. న్యూయార్క్లోని లాంగోన్స్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా.రాబర్ట్ మోంట్గోమోరి ఆధ్వర్యంలో పరిశోధనలు జరిపారు. అమెరికాలో ఓ వ్యక్తి బ్రెయిన్డెడ్ కాగా కుటుంబ సభ్యులు అనుమతితో అతని శరీరంపై పరిశోధనలు చేశారు. పంది కిడ్నీని సేకరించి దాని జన్యువుల్లో మార్పులు చేసి అతని ఒక కిడ్నీ స్థానంలో ప్రవేశపెట్టారు. వెంటనే అది పని చేయడం ప్రారంభించింది. మూత్రాన్ని ఉత్పత్తి చేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికీ కిడ్నీ పనిచేస్తున్నదని పరిశోధనలకు నాయకత్వ వహించిన ప్రొఫెసర్ రాబర్ట్ మోంట్గోమోరి తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వలంటీర్లపై ప్రయోగాలు చేసేందుకు అనుమతులు ఇచ్చే అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తున్నది. ఎఫ్డీఏ అనుమతులు లభిస్తే పరిశోధనలు మరింత ఊపందుకోనున్నాయి.
మనిషికి పంది కిడ్నీ అమర్చిన అమెరికా డాక్టర్లు !
August 17, 2023
0
Tags