తిరుమల కొండపై చిక్కిన మరో చిరుత

Telugu Lo Computer
0


తిరుమలలో గురువారం ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. నామాలగవి దగ్గర చిరుతను అధికారులు బంధించారు. రెండు నెలల్లో మూడు చిరుతలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల కింద ఒకటి, ఇవాళ మరో చిరుత చిక్కడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ  ఇంకా 2-3 చిరుతలు నడకమార్గంలో సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట నరసింహస్వామి ఆలయం దగ్గర్లోనే ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది. మిగతా వాటిని కూడా బంధించి మరోచోట వదిలిపెట్టేందుకు ఆపరేషన్‌ చిరుత కొనసాగించారు.. ఈ క్రమంలోనే మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేస్తే ఇవాళ మళ్లీ ఓ చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. అధికారులు మొత్తం 3 చోట్ల ట్రాప్‌లు పెట్టగా.. నరసింహస్వామి ఆలయ సమీపంలో ఒకటి ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట దగ్గర మరో ట్రాప్, మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు దగ్గర కూడా ఒక బోన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ సత్ఫలితాన్నిచ్చి మరో చిరుత చిక్కింది. తిరుమల అలిపిరి మార్గంలో 7వ మైలు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను చిరుత బలితీసుకుంది. దీంతో అలర్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం.. మెట్ల మార్గంలో ఆంక్షలను కూడా విధించింది. చిన్నారులకు మధ్యాహ్నం నుంచి మెట్ల మార్గంలో ప్రవేశాన్ని నిషేధించింది. అంతేకాకుండా భక్తులకు కర్రలను కూడా అందజేస్తోంది. అయితే, చిన్నారి ఘటన తరువాత తిరుమలకొండపై ఓ చిరుత బోనుకు చిక్కగా.. నామాలగవి ప్రాంతంలో మరో చిరుత సంచరించడం, ఈ క్రమంలోనే మెట్ల మార్గంలో ఎలుగుబంటి కనపడటం కలకలం రేపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)