పాకిస్తాన్లో కంటే భారత్లో ముస్లింలు ఎంతో మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పాక్లో మైనార్టీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని వారి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. దేశంలో ముస్లింలపై వివక్షత, దాడులు జరుగుతున్నాయంటూ పాశ్చాత్య పత్రికల్లో వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోని ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వాషింగ్టన్లో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్తో సహా వివిధ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. భారత్ పెట్టుబడులపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆమె తప్పుబట్టారు. తనకంటే భారత్కు వస్తున్న పెట్టుబడిదారులే దీనికి సరైన సమాధానం చెప్తారని అన్నారు. 'ఇండియాలో పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి ఉన్న వారిని నేను ఒకటే కోరుతున్నా..ఎవరో చెప్పింది వినడం కంటే.. భారత్కు రండి.. దేశంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి' అని పీఐఐఈ ప్రెసిడెంట్ ఆడమ్ ఎస్ పోసెన్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలోని ఎంపీలు హోదా కోల్పోతున్నారని, భారతదేశంలోని ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతున్నారని పాశ్చాత్య పత్రికల్లో వచ్చిన వార్తలపై సీతారామన్ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉందన్నారు. ముస్లింలా జనాభా సంఖ్యాపరంగా పెరుగుతోందన్నారు. ముస్లింలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని, వ్యాపారాలను హాయిగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. భారత్లో 1947 తరువాత ముస్లింల జనభా తగ్గడం గానీ, మరణాలు పెరగడం గానీ జరిగాయా అని ప్రశ్నించారు. 'భారత్ ఏర్పడిన సమయంలోనే పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. పాక్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు కానీ అక్కడ మైనారిటీల పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. అంతేగాక ముస్లింలోని కొన్ని తెగలు సైతం క్షీణిస్తున్నాయి. అక్కడి మైనార్టీలపై చిన్న చిన్న ఆరోపణలకే తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు. వ్యక్తిగత కోపాలను తీర్చుకునేందుకు కఠిన శిక్షలు, మరణశిక్షలు విధిస్తున్నారు .విచారణ లేకుండానే అనేకమంది బాధితులను వెంటనే దోషులుగా మార్చుతున్నారు. పాక్లోని ముస్లింల కంటే భారతదేశంలోని ముస్లింలు మెరుగ్గా పనిచేస్తున్నారు' అని నిర్మలా పేర్కొన్నారు.
పాకిస్తాన్లో కంటే భారత్లో ముస్లింలు మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారు !
April 11, 2023
0
Tags