'సీతా రామం'తో అందరి మనసుల్లో చెదరని ముద్ర వేసుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా తర్వాత మంచి చిత్రాలను ఎంపిక చేసుకొని నటిస్తోంది. ఈ అమ్మడు నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'గుమరాహ్' . ఇందులో మృణాల్ పోలీస్ పాత్రలో అలరించనుంది. ఆదిత్య రాయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలవ్వనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ 'సీతా రామం' తనపై ఎంత ప్రభావం చూపిందో చెప్పింది. అలానే నాచురల్ స్టార్ నానితో చేయనున్న సినిమా స్క్రిప్ట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''సీతా రామం'లో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఆ సినిమా తర్వాత నేను పెద్ద దర్శక నిర్మాతలను కలిసి వారితో పనిచేయాలని ఉందని అడిగినప్పుడు 'మృణాల్ మీకోసం మంచి పాత్రను సిద్ధం చేస్తాం. 'సీతా రామం'లో పాత్ర కంటే గొప్పగా ఉండేలా రాయలంటే కొంచెం సమయం పడుతుంది' అని చెప్పారు. అందుకే నాకు ఆ సినిమా తర్వాత మరొక ప్రాజెక్ట్ ఓకే చేయడానికి ఆరు నెలలు పట్టింది'' అని మృణాల్ చెప్పింది. ఇక నాని 30వ సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్ను ఇప్పటి వరకు చదవలేదని చెప్పింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఇక మృణాల్ మాటలు నాని అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. నాని 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాతో సౌరవ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమా రెండో షెడ్యూల్ 40 రోజులపాటు గోవాలో జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
నాని 30వ చిత్రంపై మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు !
April 06, 2023
0
Tags