సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి పాకిస్తాన్ ప్రభుత్వం కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. ఇంధన ఆదాతో పాటు చమురు దిగుమతులను తగ్గించేందుకుగానూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో భాగంగా జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా మార్కెట్లు, వివాహ వేదికలను సాధారణ సమయానికి ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ 'రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాల్స్ను మూసివేయాలి. దీంతో 60 బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని నిలిపివేస్తాం. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తాం. దీంతో మరో 37 బిలియన్లు ఆదా అవుతాయి. ఏడాదిలోపు కేవలం కొనికల్ గీజర్ల వాడకాన్ని తప్పనిసరి చేస్తాం. ఫలితంగా తక్కువ గ్యాస్ వినియోగంతో 92 బిలియన్లు మిగులుతాయి. వీధి దీపాల్లో మార్పులతో మరో 4 బిలియన్లు ఆదా అవుతాయి. నేడు జరిగిన కేబినెట్ భేటీ కూడా పగటి పూట వెలుతురులోనే జరిగింది. భేటీలో లైట్లను ఉపయోగించలేదు అని చెప్పుకొచ్చారు. 2023 ఏడాది చివరి నాటికి దేశంలో ఎలక్ట్రిక్ బైక్లను తీసుకువస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కూడా ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు.
పాకిస్తాన్ లో ఇంధన పొదుపుకు ప్రణాళికల ప్రకటన !
January 04, 2023
0
Tags