ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని బీడీ మార్గ్‌ ప్రాంతంలో ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్లమెంట్‌ భవనానికి సమీపంలోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో, రాజ్యసభ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్లలో ఒకదాంట్లో మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా, మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. అయితే, ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 10కి పైగా ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చాయి. అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో మంటలు ప్రారంభమై, పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలతో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు, ఇది ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రాథమికంగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. 'ఎంపీలకు కేటాయించిన అత్యంత రక్షిత ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా లోపమా?' అని వారు ప్రశ్నించారు. అపార్ట్‌మెంట్‌ల నిర్వహణ బాధ్యత వహించే ఏజెన్సీ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు నివసించే ప్రాంతంలోనే భద్రతా చర్యలు లేని పరిస్థితి దేశానికి ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)