యూకే ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను ప్రారంభించేందుకు అంగీకారం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తో సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ, విద్య, వాణిజ్యం, సాంకేతికత వంటి పలు విభాగాలపై విస్తృత చర్చలు జరిపారు. భారత్‌-యూకే మధ్య రక్షణ రంగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం భారత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షకులుగా సేవలు అందించనున్నారు. ఇది రెండు దేశాల రక్షణ సహకారంలో కొత్త దశ ప్రారంభమని నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యారంగంలోనూ రెండు దేశాలు పెద్ద ముందడుగు వేశాయి. యూకేకు చెందిన తొమ్మిది ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ప్రారంభించేందుకు అంగీకరించాయి. ఇటీవలే సౌతాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్‌లో తన క్యాంపస్‌ను ప్రారంభించిందని, తొలిబ్యాచ్ విద్యార్థులు ఇప్పటికే ప్రవేశాలు పొందారని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయ అంశాలపై కూడా రెండు దేశాలు సమగ్ర చర్చలు జరిపాయి. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న ఉద్రిక్తతలపై శాంతియుత పరిష్కారం కోసం దౌత్య మార్గాలను ప్రోత్సహించడంలో భారత్ కట్టుబడి ఉందని మోడీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, పశ్చిమాసియాలో స్థిరత్వం కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్-యూకే బంధం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన వంటి ఉమ్మడి విలువలపై నిలదొక్కుకున్నదని మోడీ అన్నారు. యూకేలో నివసిస్తున్న 18 లక్షల మంది భారతీయులు రెండు దేశాల మధ్య స్నేహానికి వారధిగా ఉన్నారని ఆయన అభినందించారు. సాంకేతికత, ప్రతిభ ఆధారంగా ఈ భాగస్వామ్యం మరింత బలపడుతోందని, కొద్ది నెలల క్రితం కుదిరిన సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం (సెటా)తో ఇరు దేశాల సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టాయని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)