ఎంబీబీఎస్‌ విద్యార్ధిని గ్యాంగ్‌ రేప్‌ కేసులో స్నేహితుడి అరెస్ట్‌

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లో ని దుర్గాపూర్‌ గ్యాంగ్‌రేప్‌ కొత్త మలుపు తిరిగింది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్‌ సఫీఖుల్, షేక్‌ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్‌ షేక్, షేక్‌ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని కూడా అరెస్ట్‌ చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, క్లాస్‌మేట్‌ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్‌ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్‌సోల్‌-దుర్గాపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ చౌదరి  మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్‌ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్‌ కావడం గమనార్హం. దుర్గాపూర్‌ పట్ణణ శివారులోని ప్రైవేట్‌ ఎంబీబీఎస్‌ కళాశాల హాస్టల్‌ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్‌రేప్‌ జరిగిందని కేసు నమోదవడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ గుప్తా సారథ్యంలోని బృందం సీన్‌ రీక్రియేషన్‌ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు.ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్‌ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్‌ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్‌చే శామని కమిషనర్‌ చెప్పారు. ''బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్‌మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్‌రేప్‌ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది'' అని కమిషనర్‌ వ్యాఖ్యానించారు.నిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్‌కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్‌ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రేప్‌ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్‌ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ''ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్‌ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్‌ చేసి రమ్మన్నారు. ఫోన్‌ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్‌ చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు'' అని కమిషనర్‌ వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)