'వ్యూస్' కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు : పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో 'వ్యూస్' కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్న వారిపై ఐపీఎస్ అధికారి పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో అసభ్యకరమైన కంటెంట్ సృష్టించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ X వేదికగా పోస్ట్ చేశారు. వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!? అని ఆయన ప్రశ్నించారు.పిల్లలను తప్పుదోవ పట్టించకుండా, యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయాలని సజ్జనార్ సూచించారు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు.. క్షమార్హం, చట్టరీత్యా నేరం అని ఆయన స్పష్టం చేశారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేయడం POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని.. ఇది పూర్తిగా చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుందని ఆయన హెచ్చరిక చేశారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ తెలిపారు. ఇలాంటి వీడియోలను తక్షణమే తొలగించాలని లేదా భవిష్యత్‌లో ఇలాంటి కంటెంట్ అప్‌లోడ్ చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే, హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు తమ బాధ్యతను గుర్తు చేస్తూ.. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్ ముగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)