ఆర్టీసీ బస్టాండ్ లలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు !

Telugu Lo Computer
0


తెలంగాణ ఆర్టీసీని సమూలంగా మార్చడానికి, ఆర్టీసీ బస్టాండ్ లను ఆధునీకరించడానికి కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, ఆర్టీసీ సంస్థకు ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో ఆర్టీసీ బస్టాండ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్టాండ్లలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, సర్వీస్ సెంటర్ లతోపాటు ఏ రకమైన వర్తక వ్యాపారాలు చేయడానికి అయినా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు బస్టాండ్ లో అందుబాటులో ఉన్న షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసేలా, తమ ప్రయాణాలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకునేలా ఆర్టీసీ ప్లాన్ చేసింది. ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఇటీవల హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ వంటి ప్రధాన బస్టాండ్ లను పరిశీలించి, ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్టాండ్ లు కేవలం ప్రయాణ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రయాణికులకు షాపింగ్, వినోద అనుభూతిని పంచే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీని ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ తీసుకునే నిర్ణయంతో అవసరాలకు తగ్గట్టు ఏ వస్తువునైనా షాపు లీజుకు తీసుకున్న వారు విక్రయాలు చేసుకోవచ్చు. ఆర్టీసీ నిర్ణయంతో బస్టాండులు ఆధునికీకరణకు నోచుకోనున్నాయి. అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తే ఆర్టీసీ బస్టాండ్ లోపల కమర్షియల్ స్పేస్ ను లీజుకు తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. దీని వల్ల ఆర్టీసీకి లీజుల రూపంలో గణనీయమైన ఆదాయం వస్తుంది. ఇప్పటికే ఉచిత బస్సుల పుణ్యమా అని, కొత్త బస్సులు, మరికొంత మందికి ఉపాధి కలుగుతుంది. ఈ నిర్ణయం కూడా అమలైతే ఆర్టీసీ ఆధునికీకరణ జరిగినట్టు అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)