భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం

Telugu Lo Computer
0


శ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో గ్రామాలు ముంపునకు గురవుతుండగా, పట్టణాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం వచ్చే 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు గంటకు 50-70 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్లు విరిగి పడిపోతున్నాయి. నదులు, వాగులు, వంతెనలు పొంగిపొర్లిపోతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం నగరం వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో అతలాకుతలమైంది. జీవీఎంసీ కార్యాలయం, ఆకాశవాణి రేడియో కేంద్రం పరిసరాల్లో చెట్లు నేలకొరిగాయి. లారీలు, వాహనాలపై పెద్ద పెద్ద వృక్షాలు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సీతమ్మధార, వాల్తేరు, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసి వజ్రపుకొత్తూరు మండలంలోని హుకుంపేట, గునుపల్లి గ్రామాల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. వెంటనే స్పందించిన అధికారులు ఫైరింజన్లు, ప్రొక్లెయిన్లు పంపి నీటిని బయటకు పంపే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాల బీభత్సం మరింత పెరిగింది. జి.మాడుగుల కొత్తపల్లి జలపాతం ఉద్ధృతంగా మారడంతో పర్యాటకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాగులు, వంకలు పొంగి వాహన రాకపోకలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో చెట్లు విరిగిపడి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలు, గాలుల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులపై జలప్రవాహం పెరగడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. బొర్రా జంక్షన్ సమీపంలో చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదని సూచిస్తున్నారు. వర్షాల బీభత్సం నేపథ్యంలో విపత్తు నిర్వహణ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. తక్కువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌ను శిబిరాలుగా మార్చి ఆహారం, వసతి కల్పిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు వర్షాలు కొనసాగవచ్చని స్పష్టం చేసింది. ఆకస్మిక వరదలు, ఈదురుగాలులు ముప్పు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, సముద్ర వేటకు మత్స్యకారులు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)