ఆస్ట్రేలియాలో పెర్త్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణయాన్ని పేసర్లు సరైనదిగా నిరూపించారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో.. పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ విజృంభించడంతో భారత అగ్రశ్రేణి బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభ్మన్ గిల్ (10) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. 9 ఓవర్లలోపే 25 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) కాసేపు నిలబడి జట్టు స్కోరును గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, కీలక సమయంలో వీరిద్దరూ ఔటవ్వడం మలుపు తిప్పింది. చివర్లో తెలుగు యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 19 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో మెరవడంతో, వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఇన్నింగ్స్లో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునెమాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో ఆసీస్కు శుభారంభం దక్కకపోయినా, కెప్టెన్ మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 46 నాటౌట్) నిలకడగా ఆడాడు. జోష్ ఫిలిప్పే (37)తో కలిసి మార్ష్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన మార్ష్, రెన్షా (21 నాటౌట్)తో కలిసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లోని రెండో వన్డే అక్టోబరు 23న అడిలైడ్ లో జరగనుంది.
భారత్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా !
October 19, 2025
0
Tags