పాకిస్తాన్ నుంచి జపాన్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మానవ అక్రమ రవాణా ముఠా డ్రామా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ముఠా తమను తాము ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాళ్లమని చెప్పుకుంటూ అక్రమంగా జపాన్లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే జపాన్ అధికారులు వారి మోసాన్ని పసిగట్టి ఆ బృందంలోని మొత్తం 22 మందిని పాకిస్తాన్ కు తిరిగి పంపించారు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ వ్యక్తులందరూ ఫుట్బాల్ జెర్సీలు ధరించి ప్రయాణించారు. వారు పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్కు చెందినవారని చెప్పడానికి ప్రయత్నించారు. అంతే కాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఫేక్ ఎన్ వోసీ పత్రాలు కూడా వారి వద్ద ఉన్నాయని అధికారులు గుర్తించారు. జపాన్ అధికారులు విమానాశ్రయంలో వారిని ప్రశ్నించినప్పుడు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది. ఈ నేపథ్యంలో వారి మోసం బయటపడింది. అయితే ఈ వ్యక్తులు పాకిస్థాన్లోని విమానాశ్రయాల నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా అంతర్జాతీయ ప్రయాణానికి ఎలా అనుమతి పొందారనే దానిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది పాకిస్తాన్ విమానాశ్రయాల్లోని భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి మలిక్ వకాస్ అని విచారణలో తేలింది. సియాల్కోట్కు చెందిన మలిక్ వకాస్ 'గోల్డెన్ ఫుట్బాల్ ట్రయల్' పేరుతో ఒక ఫేక్ ఫుట్బాల్ క్లబ్ను స్థాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిని జపాన్కు పంపించడానికి ఒక్కొక్కరి నుంచి 40 లక్షల నుంచి 45 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. మాలిక్ వకాస్ను సెప్టెంబర్ 15న అరెస్ట్ చేసి అతనిపై పలు కేసులు నమోదు చేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మాలిక్ వకాస్ గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు. జనవరి 2024లో ఇదే తరహాలో నకిలీ పత్రాలు, జపాన్ క్లబ్ 'బోవిస్టా ఎఫ్సీ' నుంచి నకిలీ ఆహ్వాన పత్రాలను ఉపయోగించి 17 మందిని జపాన్ కు పంపినట్లు వెల్లడించారు. అయితే ఆ 17 మందిలో ఎవరూ తిరిగి రాలేదని అధికారులు తెలిపారు.
ఫుట్బాల్ ఆటగాళ్లమని చెప్పుకుని పాకిస్తాన్ నుంచి జపాన్కు వెళ్లేందుకు ప్రయత్నించిన మానవ అక్రమ రవాణా ముఠా !
September 18, 2025
0
Tags