వైద్య పరికరాలపై కొత్త ధరల స్టిక్కర్లు అంటించాలన్న నిబంధనను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

Telugu Lo Computer
0


కొన్ని వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లను ఇటీవల తగ్గించిన నేపథ్యంలో, మార్కెట్లో ఇప్పటికే ఉన్న మందుల ప్యాకెట్లపై ఫార్మాస్యూటికల్ కంపెనీలు కొత్త ధరల స్టిక్కర్లను తప్పనిసరిగా అంటించాలన్న నిబంధనను రద్దు చేసింది. సెప్టెంబర్ 22లోపు మార్కెట్లోకి విడుదలైన స్టాక్‌ను వెనక్కి పిలవడం లేదా రీ-లేబులింగ్ చేయడం తప్పనిసరి కాదని ఫార్మాస్యూటికల్స్ విభాగం స్పష్టం చేసింది.ఈ నెల ప్రారంభంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వైద్య పరికరాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మార్పు నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న పాత స్టాక్‌ను రీ-లేబుల్ చేయడం ఆచరణ సాధ్యం కాదని, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఫార్మా పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఒక కీలక ప్రకటన జారీ చేసింది.పాత స్టాక్‌ను వెనక్కి పిలవాల్సిన అవసరం లేకుండా, సవరించిన ధరలతో కూడిన జాబితాను కంపెనీలు జారీ చేస్తే సరిపోతుందని తెలిపింది. ఈ కొత్త ధరల జాబితాను డీలర్లు, రిటైలర్లతో పాటు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు, ప్రభుత్వానికి అందించాలని సూచించింది. రిటైలర్లు తమ వద్ద ఆ జాబితాను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించింది. దీనివల్ల మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఉండవని, రోగులకు మందుల కొరత ఏర్పడదని ప్రభుత్వం భావిస్తోంది.జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్లలో ఉన్న పరిమితులు, ఇన్వర్టెడ్ డ్యూటీ సమస్యలను పరిష్కరించాలని కోరింది. సర్వీసులు, క్యాపిటల్ గూడ్స్‌పై చెల్లించిన ఐటీసీకి కూడా రిఫండ్ అనుమతించాలని, ఇన్‌పుట్స్‌పై ఒకే విధంగా 5 శాతం జీఎస్టీ విధించాలని సూచించింది.ఏఐఎంఈడీ ఫోరమ్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ మాట్లాడుతూ, "ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇన్‌పుట్స్‌పై చెల్లించిన జీఎస్టీకి పూర్తి రిఫండ్ ఇస్తున్నారు. దీనివల్ల వ్యాపారాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. మన దేశంలోనూ ఇలాంటి సంస్కరణలు తీసుకువస్తేనే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గుతాయి 'మేక్ ఇన్ ఇండియా' బలోపేతం అవుతుంది" అని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)