తెలంగాణలోని కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యువతిపై హాస్పిటల్లో పని చేస్తున్న ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు. జగిత్యాలకు చెందిన యువతి మెరుగైన వైద్యం కోసం దీపిక అనే ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. చికిత్స అందించే వైద్యుడు సూచన మేరకు ఆస్పత్రిలో పని చేసే యువకుడు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలిసిన సామాజిక కార్యకర్తలు, డివైఎఫ్ఐ నాయకులు ఆసుపత్రి దగ్గర బైఠాయించి నిరసన తెలిపి ఆసుపత్రిని మూసివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి చర్యలు తీసుకోవడానికి పోలీసులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది. ఘటనపై డీఎంహెచ్ఓ విచారణ ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ చేరుకొని రికార్డులు, పర్మిషన్, ఆస్పత్రి సిబ్బంది రిజిస్టర్లను తనిఖీ చేసి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వారి వివరాలు లేవని పూర్తి సమాచారం ఆస్పత్రి నిర్వాహకుల దగ్గర లేదని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసి తక్షణ చర్యల కోసం జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల పర్మిషన్ కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇందులో భాగస్వామ్యమైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పూర్తి సాక్షాధారాలు విచారణ చేపట్టిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు అందిందని దాని ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేసిన యువకుడు !
September 08, 2025
0
Tags