పాకిస్థాన్, గల్ఫ్, మలేసియా నుంచి టీఆర్‌ఎఫ్‌కు నిధులు

Telugu Lo Computer
0


హల్లాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసిన లష్కరే ముసుగు సంస్థ 'ది రెసిస్టెంట్ ఫ్రంట్'కు ఏయే దేశాల నుంచి నిధులు అందుతున్నాయనే కీలక వివరాలను ఎన్ఐఏ  తాజాగా వెలికితీసింది. పాకిస్థాన్, గల్ఫ్, మలేసియా నుంచి టీఆర్‌ఎఫ్‌కు నిధులు అందినట్టు ఎన్ఐఏ గుర్తించింది. లష్కరే తొయిబా ముసుగు సంస్థగా టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థను పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. దీనిని జమ్మూకశ్మీర్‌లో వేళ్లూనుకునేలా చేసి స్థానిక సంస్థగా ప్రాజెక్ట్ చేసింది. తద్వారా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు కొనసాగించడం, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) స్క్రూటినీలోకి రాకుండా చూసుకోవడం పాక్ వ్యూహంగా ఉన్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం టీఆర్ఎఫ్ ఆపరేషన్‌పై ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ముఖ్యంగా మలేసియా, గల్ఫ్ దేశాల నుంచి టీఆర్ఎఫ్‌కు నిధులు అందినట్టు గుర్తించింది. ఇందుకోసం 463 ఫోన్ కాల్స్‌ను విశ్లేషించింది. మలేసియాకు చెందిన యాసిర్ హయత్ అనే వ్యక్తి టీఆర్ఎఫ్‌కు రూ.9 లక్షలు ఇచ్చినట్టు గుర్తించింది. ఇతనికి లష్కరే మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది సాజిద్ మిర్ నెట్‌వర్క్‌కు చెందిన సంస్థలతో సంబంధం ఉందని వెలికితీసింది. ఫండ్స్ ఎరేంజ్ చేసేందుకు హయత్ పలుమార్లు మలేసియా వెళ్లినట్టు గుర్తించింది. ఇటీవల శ్రీనగర్, హంద్వార్‌లో జరిగిన దాడుల్లో టీఆర్ఎఫ్ విదేశీ నిధులకు సంబంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడంతో టీఆర్ఎఫ్‌కు అందుతున్న టెర్రర్ ఫండింగ్‌పై మరింత లోతుగా విశ్లేషిస్తోంది. ఎన్ఐఏ వెలికితీసిన తాజా సమాచారంతో పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టాలని భారత్ బలంగా వాదించే అవకాశాలున్నాయి. 2018లో పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్ట్‌లో చేర్చగా.. 2022లో ఎఫ్ఏటీఎఫ్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం ద్వారా గ్రేలిస్ట్ నుంచి పాక్ బయటపడిది. దీనిపై భారత్ గట్టి అభ్యంతరం తెలియజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)