తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి చంద్రబాబు స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమలలో మరో యాత్రీకుల వసతి సముదాయం పీఏసీ 5 అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఉదయం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో కలిసి సీపీ రాధాకృష్ణన్ దీన్ని ప్రారంభించారు. దీనిని భక్తులకు అంకితం చేశారు. అన్న ప్రసాద వితరణ హాలు, కల్యాణకట్ట ఇందులోనే ఉన్నాయి. తలనీలాలు ఇక్కడే సమర్పించవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చు. అందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, అక్కడ కనిపించే రింగ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలివేస్తే వారికి ఐదు రూపాయలు ప్రోత్సాహకంగా లభిస్తుంది. పరిసరాల పరిశుభ్రత, సామాజిక అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణ కోసం టీటీడీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 58,628 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 21,551 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.01 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు.
యాత్రీకుల వసతి సముదాయం పీఏసీ 5ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
September 25, 2025
0
Tags