అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు ఇకపై విదేశీ ఉద్యోగుల హెచ్1బీ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త నియమావళికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 2025 జనవరిలో పదవిలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా నిబంధనలను సవరించడం ఇదే కోవలోకి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, "మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే, మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులైన వారికి ఇవ్వండి. ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావడం ఆపేయండి" అని స్పష్టం చేశారు. ప్రస్తుత విధానం ప్రకారం, అమెరికా ప్రభుత్వం కొన్ని రంగాల్లో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలకు ఏటా 65,000 సాధారణ హెచ్1బీ వీసాలు, అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్నవారికి అదనంగా 20,000 వీసాలు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం వీసా దరఖాస్తుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోతుంది, ఆ తర్వాత ఆమోదం పొందిన వారికి వేల డాలర్లలో రుసుములు ఉంటాయి. అయితే, ట్రంప్ విధించిన కొత్త నిబంధన ప్రకారం, ఈ రుసుము లక్ష డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని కంపెనీలే భరించాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసాలు పొందినవారిలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మొత్తం హెచ్1బీ వీసాలలో 71% భారతదేశానికి లభించగా, చైనా 11.7%తో రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ అమెరికాలో శాశ్వత నివాసం కోసం మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఒక మిలియన్ డాలర్లు చెల్లించగలిగేవారికి 'గోల్డ్ కార్డ్' ను ప్రవేశపెట్టేందుకు ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
హెచ్1బీ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్లు : డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ
September 20, 2025
0
Tags