సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 19' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. షో మేకర్స్ కత్రినా కైఫ్ 'చిక్నీ చమేలి', ఇమ్రాన్ ఖాన్ 'ధత్ తేరీ కీ' అనే రెండు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. మిడ్-డే ఇండియా ప్రకారం ఫోనోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్ (పీపీఎల్) సంస్థ 'బిగ్ బాస్ 19' మేకర్స్కు లీగల్ నోటీసు పంపింది. సెప్టెంబర్ 3న ప్రసారమైన 11వ ఎపిసోడ్ బిగ్ బాస్ 19లో అగ్నిపథ్ చిత్రం నుంచి 'చిక్నీ చమేలి', 'గోరీ తేరే ప్యార్ మే' చిత్రం నుండి 'ధత్ తేరి కీ' పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆ నోటీసులో పేర్కొంది. రియాలిటీ షోకు మద్దతు ఇస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియా సంస్థ 'తప్పనిసరి పబ్లిక్ పర్ఫార్మెన్స్ లైసెన్స్' తీసుకోకుండా ఈ సౌండ్ రికార్డింగ్లను ఉపయోగించిందని పీపీఎల్ ఇండియా ఆరోపించింది. సెప్టెంబర్ 19న జారీ చేయబడిన ఈ నోటీసును అడ్వకేట్ హితేన్ అజయ్ వాసన్ అందించారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్లు థామస్ గౌసెట్, నికోలస్ చజారైన్, దీపక్ ధర్లను బాధ్యులుగా పేర్కొన్నారు. న్యాయ బృందం వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు పాటల లైసెన్స్ సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇండియాకు ఉంది. పీపీఎల్ దగ్గర 450కి పైగా మ్యూజిక్ లేబుల్స్ లైసెన్సులు ఉన్నాయి. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 30 కింద ఎండెమోల్ షైన్ ఇండియా లైసెన్స్ పొందకపోవడం వల్ల, ఈ పాటల ఉపయోగం 'తెలిసి చేసిన ఉల్లంఘన' కిందకు వస్తుందని పీపీఎల్ వాదిస్తోంది.
'బిగ్ బాస్ 19' మేకర్స్కు లీగల్ నోటీసు పంపిన ఫోనోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్
September 26, 2025
0
Tags