బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్ వైల్డ్‌లైఫ్ సఫారీలో బాలుడిపై దాడి చేసిన చిరుత !

Telugu Lo Computer
0


బెంగళూరు బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్ వైల్డ్‌లైఫ్ సఫారీలో 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి ఎడమ చేతికి గాయమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెలవు రోజు కావడంతో బెంగళూరు బొమ్మసంద్రకు చెందిన ఆ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి సరదాగా బన్నేరుఘట్ట జూపార్క్ కు వెళ్లాడు. అనంతరం ఓ జీప్ లో సఫారీ చేశారు. సపారీకి వెళ్లిన సమయంలో రోడ్డు పక్కనే చిరుత కనిపించింది. దాన్ని చూస్తూ వాళ్లు ముందుకు సాగారు. అప్పటివరకు రోడ్డు పక్కనే సైలెంట్ గా కనిపించిన ఆ చిరుత జీప్ కొంత దూరం వెళ్లిన తరువాత ఒక్క ఉదుటన జీప్ ను వెంబడించి దాని పైకి జంప్ చేసింది. వెనుక సీట్ లో ఎడమ వైపు కిటికీ వైపు చెయ్యి బయట పెట్టి కూర్చున్న ఆ బాలుడిని గాయపరిచింది. చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో జీప్ లో ఉన్నవాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ జీప్ వెనుక మరో వాహనంలో వస్తోన్న వాళ్లు దీన్నంతటినీ తమ వీడియోలో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘటన సంభవించిన వెంటనే సఫారీ జీప్ డ్రైవర్ వాహనాన్ని బయబటికి మళ్లించాడు. గాయపడిన బాలుడిని జిగణిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల బన్నేరుఘట్ట జూపార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవీ సూర్య సేన్ స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏసీ లేని వాహనంలో ప్రయాణించే సమయంలో బాలుడికి గాయాలయ్యాయని, కిటికీ బయటపెట్టి ఉండటం వల్ల చిరుత పంజా విసిరిందని అన్నారు. అన్ని సఫారీ బస్సులు, జీప్ లు, వాహనాలకు మెటల్ మెష్ కవరింగ్‌లు ఉన్నాయని, సందర్శకులు తమ చేతులను బయట పెట్టడం, వణ్యప్రాణులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి కారణాలు.. ఇలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. మరిన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)