పిల్లలు మొండిగా వ్యవహరించినప్పుడు, లేదా మాట విననప్పుడు చాలామంది తల్లిదండ్రులు కోపంతో వారిని అరుస్తారు లేదా కొడతారు. అయితే, ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. పరిశోధనలు, బాలల మనస్తత్వ నిపుణుల ప్రకారం నిరంతరం అరుస్తూ, శిక్షిస్తూ ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం తగ్గి, భయం లేదా మరింత మొండితనం పెరిగే అవకాశం ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ మాటకే ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు చెప్పేది వినరు. దీనివల్ల పిల్లలు చిరాకుపడి, మొండిగా తయారవుతారు. పిల్లలు చెప్పేది పూర్తిగా విని, వెంటనే అరవకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వారు మీ దగ్గర సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. ఇది వారిలో విశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలను బయట ప్రపంచంలోని ప్రమాదాల నుంచి కాపాడటానికి కొందరు తల్లిదండ్రులు వారిని బయటకు వెళ్లనివ్వరు, ఎవరినీ కలవనివ్వరు. ఏదైనా తప్పు చేస్తే అరుస్తారు. దీనివల్ల పిల్లలు అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. ఇలా చేయకుండా వారికి ఏది సరైనదో, ఏది తప్పో ప్రేమగా చెప్పి అర్థం చేయించాలి. దీనివల్ల వారు మీతో అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉంటారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి ఉత్తమ మార్గం, ముందుగా మీరు క్రమశిక్షణతో ఉండడం. పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీరు సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం, ప్రశాంతంగా మాట్లాడటం వంటివి చేస్తే, పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి ముందు మీరు క్రమశిక్షణతో ఉండండి. పిల్లలకు ప్రోత్సాహం అవసరం. వారికి క్రమశిక్షణ నేర్పిస్తున్నప్పుడు, వారు ఏదైనా మంచి పని చేస్తే వారిని అభినందించండి లేదా బహుమతి ఇవ్వండి. ఉదాహరణకు, ఈ రోజు నువ్వు నీ హోంవర్క్ సమయానికి పూర్తి చేశావు, కాబట్టి నేను నీకు ఇష్టమైనది వండి పెడతాను అని చెప్పండి. ఇది వారిలో సానుకూల అలవాట్లను ప్రోత్సహిస్తుంది. వారిని మరింత మంచిగా చేయడానికి ప్రేరేపిస్తుంది.
పిల్లలు - క్రమశిక్షణ !
August 02, 2025
0
Tags