రుషికొండ భవనాల వినియోగంపై సీఎంకు త్వరలో ప్రతిపాదనలు ఇస్తా !

Telugu Lo Computer
0


విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతలతో కలిసి రుషికొండలో జగన్ హయాంలో నిర్మాణం చేసిన భవనాలను మరోసారి పరిశీలించారు. పరిశీలన సమయంలో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్మాణాల నాణ్యతను పరిశీలించారు. నిర్మాణ ఖర్చు, ప్రస్తుతం నిర్వహణ ఖర్చు పైన ఆరా తీసారు. పెచ్చులు ఊడి పడుతుండగా గమనించారు. భవనాలను వినియోగించ కుండా వదిలేయటం కారణంగా నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం లేకపోవటం పైన అధికారులను ప్రశ్నించారు. పార్టీ నేతలతోనూ వీటి వినియోగం పైన చర్చించారు. దీంతో, తన ప్రతిపాదనలను ప్రస్తావించారు. తమ పార్టీ నుంచి రిషికొండ భవనాల వినియోగం పైన సీఎం చంద్రబాబుకు కొన్ని సూచనలు చేస్తున్నట్లు చెప్పారు. రుషికొండ భవనాల నిర్మాణం, నిధుల వినియోగం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగిందని పవన్ వ్యాఖ్యానించారు. రూ 453 కోట్లు పెట్టుబడి పెట్టారని చెప్పుకొచ్చారు. గతంలో రుషికొండ ద్వారా ప్రభుత్వానికి సాలీనా రూ 7 కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. ఇప్పుడు నిర్వహణలో భాగంగా కరెంటు బిల్లు కోసమే సంవత్సరానికి కోటి రూపాయలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. గతంలో సీఎం నివాసంగా వినియోగించుకొనేందుకు వీటిని నిర్మించారని పేర్కొన్నారు. ఈ భవనాల వినియోగం పైన సూచనలు చేయాలని సీఎం కోరినట్లు వెల్లడించారు. టూరిజం, ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం వినియోగించాలని సూచనలు చేసారు. బిల్డింగ్ చూపిస్తే లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పుకొచ్చారు. లాభం లేకపోయినా ఖర్చు చేసిన రూ 453 కోట్లు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుందనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. భవనాల వినియోగం పైన తాము సీఎంకు త్వరలోనే ప్రతిపాదనలు ఇస్తామని పవన్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)