కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీని అక్రమ బెట్టింగ్, మనీలాండరింగ్ నెట్వర్క్తో సంబంధ ఉందనే ఆరోపణలపై సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కేసీ వీరేంద్ర పప్పీ చిత్రదుర్గ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు 31 ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చేతికి చిక్కిన సాక్ష్యాధారాల ఆధారంగా వీరేంద్రను అరెస్ట్ చేశారు. ఈ దాడులతో దుబాయ్ కంపెనీలు దేశంలోని పలు క్యాసినోలతో సంబంధాలు ఉన్న అతి పెద్ద బెట్టింగ్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చినట్టయింది. ఈ నెల 22, 23 తేదీలలో ఈడీ అధికారులు బెంగళూరు, హుబ్లీ, చిత్రదుర్గ, ముంబై, జోధ్పూర్, గోవా, గ్యాంగ్టక్లలో పెద్ద ఎత్తున సోదాలను నిర్వహించారు. అలాగే- అయిదు ప్రముఖ క్యాసినోలు బిగ్ డాడీ, ఓషన్ రివర్స్, పప్పీస్ ప్రైడ్, ఓషన్ 7, పప్పీస్ గోల్డ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 12 కోట్ల రూపాయల నగదు, ఆరు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ కు చెందిన కొన్ని సంస్థలతో సంబంధం ఉన్న అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను వీరేంద్ర నడుపుతున్నట్లు తేలింది. కింగ్ 567, రాజా 567 అనే అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను సైతం వీరేంద్ర పప్పీ నడుపుతున్నట్లు నిర్ధారించారు. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి డైమండ్ సోఫ్ టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనే మూడు దుబాయ్ ఆధారిత సంస్థల ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహించినట్లు ఈడీ అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ కంపెనీలన్నీ కూడా గేమింగ్ కాల్ సెంటర్లను నడుపుతూ, అక్రమంగా అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్ చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. 12 కోట్ల రూపాయల నగదు, కోటి రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీ, ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు, నాలుగు విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. పీఎంఎల్ఏ 2002 యాక్ట్ కింద 17 బ్యాంక్ ఖాతాలు, రెండు లాకర్లను కూడా సీజ్ చేశారు. వీరేంద్ర మరో సోదరుడు కేసీ నాగరాజు, ఆయన కుమారుడు పృథ్వీ ఎన్ రాజ్ ఇళ్ల నుండి ఆస్తి రికార్డులు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ టక్ లో ఓ క్యాసినోను ఏర్పాటుచేయడానికి అవసరమైన భూమిని లీజుకు తీసుకోవడానికి వీరేంద్ర వెళ్లినట్లు సమాచారం. అరెస్టయిన వెంటనే ఆయనను గ్యాంగ్టక్లోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించనున్నారు. దీనికోసం ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీని అరెస్టు చేసిన ఈడీ
August 23, 2025
0
Tags