ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు పరిశీలిస్తున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. లీగల్ ఓపినియన్ అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్ జగన్ వెంట ఉన్నామని ఈ ఎన్నికల ద్వారా చెప్పడానికి పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి అరాచకాలకు పాల్పడుతోందని, వైసీపీ కార్యకర్తలను, పులివెందుల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పంటలు పండటం లేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో దొంగ హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 2029లో వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని జనం కోరుకుంటున్నారన్న రవీంద్రనాథ్ రెడ్డి.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ద్వారా జగన్ వెంటే పులివెందుల జనం ఉన్నారనే సంగతి తెలుస్తుందన్నారు.
రవీంద్రనాథ్ రెడ్డి పై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు
August 10, 2025
0
Tags