ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు. అనంతరం ఇండియా-జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. ''కమ్ మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్'' అనే ఆహ్వానాన్ని వ్యాపార వేత్తలకు అందించారు. భారతదేశంలో తయారు చేయండి - ప్రపంచం కోసం తయారు చేయాలని వ్యాపార నాయకులను కోరారు. రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు భారత్లో 40 బిలియన్కు పైగా పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఇది బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు విశ్వాసాన్ని పెంపొదిస్తుందని తెలిపారు. సాంకేతిక, మౌలిక సదుపాయాలు, తయారీ వంటి కీలక రంగాలకు సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో జపాన్లో మోడీ పర్యటన కొనసాగనుంది. ఇక జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు మొదలగు అంశాలపై మోడీ చర్చలు జరపనున్నారు. ఆగస్టు 30న మోడీ-ఇషిబా మియాగి ప్రిఫెక్చర్కు వెళ్లనున్నారు. అక్కడ సెండాయ్లోని తోహోకు షింకన్సెన్ ప్లాంట్ను పరిశీలించనున్నట్లు జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు 'బుల్లెట్ ట్రైన్' ప్రాజెక్ట్ కోసం 2030లో ఇండియాకు తరలించనున్న E-10 కోచ్లను పరిశీలించనున్నారు. అనంతరం ఒక ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ సహకారం, కృత్రిమ మేధస్సుతో సహా అనేక పత్రాలపై ఇరుపక్షాలు సంకాలు చేయనున్నారు. అలాగే అంతరిక్ష, రక్షణ సహకారాలపై కూడా ఇరువురు చర్చించనున్నారు. జపాన్ పర్యటన ముగింపుకుని ఆగస్టు 31న మోడీ చైనాకు చేరుకుంటారు. టియాంజిన్లో జరిగే ఎస్సీవో సమ్మిట్లో పాల్గొననున్నారు. శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో మోడీ సమావేశం కానున్నారు. సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు. చైనాలో జరిగే సమ్మిట్కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్కు ఎస్సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్లో భాగంగా తొలిసారి జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
భారత్ - జపాన్ దేశాల ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మోడీ
August 29, 2025
0
Tags