ఢిల్లీ పార్లమెంట్ ముఖ ద్వారం నుంచి కాంగ్రెస్, విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ చేపట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ర్యాలీ చేశారు. ర్యాలీ ఈ రోజు ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్లోని ముఖ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఆ క్రమంలోనే మార్చ్ గా వెళ్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీలకు అనుమతి లేదంటూ పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేయగా, వాటిని ఎక్కి విపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శన సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోలీసుల బారికేడ్ పై నుంచి ఎక్కి దూకారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ వరకు నిరసన ప్రదర్శన చేస్తున్న ఇండియా కూటమి నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా, 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ మోసం జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఈ ర్యాలీ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు ఇప్పుడు టెర్రరిస్టులా అని అడిగారు. ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకుంటే, అది దేశంలో ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నిరసన చేయడానికి కూడా ఇంత ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. ఇది మన ప్రజాస్వామ్యంలో దేని గురించి చెబుతోందని అడిగారు. బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, 2024లో ఓట్ల చోరీ జరిగిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం చర్చలకు సమయం కేటాయించింది. ఈ ర్యాలీ తర్వాత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎంపీలతో ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అవకతవకలపై ఒక సాధారణ వ్యూహాన్ని రూపొందించే ప్రయత్నం జరుగనుంది.
ఎన్నికల సంఘం కార్యాలయానికి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ
August 11, 2025
0
Tags