ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ బైక్ విన్యాసం విషాదకరంగా ముగిసింది. సరదా కోసం చేసిన స్టంట్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేపై వేగంగా బైకులు నడుపుతూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం కెమెరాలో రికార్డవగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆగస్టు 13న ఘజియాబాద్ సమీపంలోని ఎక్స్ప్రెస్వేపై ఇద్దరు వ్యక్తులు బైక్ స్టంట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ తమ బైక్లపై వేర్వేరు దిశల నుంచి ఒకరినొకరు సమీపిస్తూ అతివేగంతో దూసుకొచ్చారు. క్షణాల్లో రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసేవారిని కలచివేస్తున్నాయి. మృతులను రోహిత్ (31), సుబోధ్ (42)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రహదారి ఇంకా నిర్మాణ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాణాలు తీసిన బైక్ విన్యాసాలు : ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి
August 15, 2025
0
Tags