ఇండియన్ పోస్టల్ సర్వీస్లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు త్వరలో అంతరించిపోనున్నాయి. తపాలా శాఖ సర్వీసులను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా 2025 సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్తో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో ముఖ్యమైన పత్రాలను పంపించాలనుకునేవారు కేవలం స్పీడ్ పోస్ట్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు, రిజిస్టర్డ్ పోస్ట్ను ముఖ్యమైన, చట్టపరమైన పత్రాలను సురక్షితంగా పంపించడానికి ప్రధానంగా ఉపయోగించేవారు. లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకులకు సంబంధించిన పత్రాలు వంటి వాటికి ఇది సురక్షతంగా భావించేవారు. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు పొందడం దీనిలోని ఒక ముఖ్యమైన ప్రత్యేకత. అయితే, స్పీడ్ పోస్ట్ వేగవంతమైన డెలివరీకి ప్రాధాన్యత ఇస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం, దేశీయ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, ట్రాకింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని పోస్టల్ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ అనే పేరుతో స్పెషల్ సర్వీస్ ఉండదు. అయితే, రిజిస్టర్డ్ పోస్ట్లోని డెలివరీ ప్రూఫ్, తీసుకున్న వారి సంతకం వంటివి "వాల్యూ-యాడెడ్ సర్వీసెస్"గా స్పీడ్ పోస్ట్లో అందిస్తామని అధికారులు తెలిపారు. దీంతో పోస్టల్ సర్వీస్ ధరలు పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్కు స్పీడ్ పోస్ట్ కన్నా తక్కువ ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు, రిజిస్టర్డ్ పోస్ట్ కనీస ఛార్జీ రూ.26 అయితే, స్పీడ్ పోస్ట్కు ఇది రూ. 41 వరకు ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసం సామాన్య ప్రజలపై భారం మోపుతుందని మధురై ఎంపీ వెంకటేశన్ వంటి కొందరు రాజకీయ నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు స్పీడ్ పోస్ట్తో విలీనం
August 03, 2025
0
Tags