భారత వాణిజ్య విధానాలు, రష్యాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతులపై 25% పన్ను విధించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 శాతం టారిఫ్ విధించడానికి గల కారణాలు వెల్లడించారు. తన అభిప్రాయాలను 'ట్రూత్ సోషల్' ద్వారా పంచుకున్నారు. భారత్-రష్యా సంబంధాల గురించి తాను ఏ మాత్రం పట్టించుకోనని ట్రంప్ స్పష్టం చేశారు. "భారత్, రష్యాతో కలిసి ఏం చేస్తుందో నాకు అనవసరం. వారి ఆర్థిక వ్యవస్థలు కలిసి నాశనమైనా నాకు ఫర్వాలేదంటూ నిప్పులు చెరిగారు. భారత్తో తాము వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడానికి అధిక టారిఫ్ కారణమని ఆరోపించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. భారత్ పై 25 శాతం టారిఫ్ విధించడానికి గల కారణాలను ట్రంప్ వివరిస్తూ దశాబ్దాల కాలంగా తమపై విధించిన అధిక పన్నులు, వాణిజ్యపరమైన ఆంక్షలు, రష్యాతో సైనిక, రక్షణ, క్రూడాయిల్ సంబంధాలు కొనసాగించడమే కారణమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తో రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్న సమయంలో భారత్ మాత్రం రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని చెబుతూనే, అమెరికాతో భారత్ చేసే వ్యాపారం చాలా తక్కువని ట్రంప్ అన్నారు. బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉండటం కూడా డొనాల్డ్ ట్రంప్ కు నచ్చట్లేదు. అది కూడా ఆయన అసహనానికి, ఆగ్రహానికి ఓ కారణమైంది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయని ఆరోపించారు. అదే సమయంలో భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశమని, ఇప్పుడు వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరినా లేదా పన్నులు విధించినా, ఈ వారం చివరిలో ఒక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమిపై ట్రంప్ గతంలో కూడా విమర్శలు చేశారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలా చేస్తే ఆర్థికంగా ప్రతి దాడులు తప్పవని, బ్రిక్స్ దేశాలపై 10% పన్ను విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు నాశనమైనా నాకు ఫర్వాలేదు !
July 31, 2025
0
Tags