థాయిలాండ్ - కంబోడియా మధ్య సరిహద్దులోని ప్రహ్ విహార్ ఆలయం, ఎమరాల్డ్ ట్రయాంగిల్ (చోంగ్ బోక్) ప్రాంతంలోని సరిహద్దు విషయంలో ఘర్షణ సాగుతోంది. గురువారం మరోసారి రెండు దేశాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. తమ దేశానికి ఆనుకొని ఉన్న కంబోడియా సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలపై థాయ్ ఆర్మీ F-16 జెట్లతో విరుచుకుపడింది. ఈ ఉద్రిక్తతలపై థాయ్ ఆర్మీ డిప్యూటీ ప్రతినిధి రిట్చా సుక్సువానోన్ కీలక ప్రకటన చేశారు. "ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్ నుంచి ఆరు జెట్ విమానాలు మోహించాం. కంబోడియాలోని సరిహద్దులో నిర్దేశించిన భూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి" అని వెల్లడించారు. సరిహద్దు ప్రాంతంపై రెండు దేశాల మధ్య పెరుగుతున్న వివాదం మధ్య వైమానిక దాడులు జరిగాయి. అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఈ ఘర్షణల్లో ఒక పౌరుడి మృతి చెందాడు. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. థాయిలాండ్ - కంబోడియా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య శతాబ్దాల నాటిది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్-సియామ్ (ప్రస్తుత థాయిలాండ్) ఒప్పందాల నుంచి ప్రారంభమైందీ ఘర్షణ. ఈ ఒప్పందాలలో సరిహద్దు రేఖలు అస్పష్టంగా నిర్వహించారు. ముఖ్యంగా ప్రహ్ విహార్ ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విషయంలో గందరగోళం ఉంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కంబోడియాకు చెందినదిగా తీర్పు ఇచ్చినప్పటికీ, ఆలయం చుట్టూ ఉన్న భూమి గురించి రెండు దేశాలూ ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఈ వివాదం రెండు దేశాలలోనూ ఉద్రిక్తతలను పెంచుతోంది. 2025 మే 28న ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ -కంబోడియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు మరణించాడు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాలూ తమ సరిహద్దు వద్ద సైనిక బలగాలను మరింతగా మోహరించాయి. జూన్ 2025లో జరిగిన చర్చలు కొంత పురోగతిని సూచించినప్పటికీ, జులై 2025లో తా మున్ థోమ్ ఆలయం సమీపంలో మరో ఘటన జరిగింది. ఇందులో ఒక థాయ్ సైనికుడు ల్యాండ్మైన్ వల్ల గాయపడ్డాడు. కంబోడియాను ఒట్టావా సమావేశ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కొత్త ల్యాండ్మైన్లను అమర్చిందని థాయిలాండ్ ఆరోపించగా, అది వియత్నాం యుద్ధ అవశేషమని కంబోడియా వాదించింది. థాయిలాండ్- కంబోడియా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళలో మరోసారి ఇప్పుడు ఘర్షణ పూర్తి వాతావరణం ఏర్పడింది. జూన్ 8, 2025న రెండు దేశాలూ తమ సైనికులను మునుపటి స్థానాలకు తిరిగి పంపేందుకు అంగీకరించినా దేశంలో ఉన్న ఉద్వేగాల కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగిస్తున్నాయి. కంబోడియా ఈ వివాదాన్ని ICJకు తీసుకెళ్లాలని భావిస్తుండగా, థాయిలాండ్ ద్వైపాక్షిక చర్చలను సమర్థిస్తోంది.
థాయిలాండ్-కంబోడియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
July 24, 2025
0
Tags