మొహర్రం ఊరేగింపులో విషాదం

Telugu Lo Computer
0


బీహార్‌లోని మొహర్రం ఊరేగింపు సందర్భంగా దర్భాంగా జిల్లా సకత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకోర్హా గ్రామం గుండా పదుల సంఖ్యలో ప్రజలు తాజియాలతో ముందుకు కదిలారు. అదే సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాజియా పైభాగం తగిలింది. దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ సంభవించడంతో తాజియాను మోస్తున్న వారిలో కొందరు అక్కడికక్కడే పడిపోయారు. వారిలో ఒకరు స్పాట్‌లో మృతి చెందగా, మరో 24 మంది తీవ్రమైన గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అధికారులు, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఊరేగింపుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)