ఆంధ్రప్రదేశ్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్ అండ్ కో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును ఆయన కోరారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. ''ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రెస్మీట్లు పెడుతుంటే జగన్ 'ఎక్స్'లో పోస్టులు చేస్తున్నారు. ప్రజలు తమకు ఓట్లేయలేదనే అక్కసును రాష్ట్రంపై చూపుతూ కుట్రలు పన్నుతున్నారనేందుకు బలమైన ఆధారాలే ఉన్నాయి. నిధుల సమీకరణ కోసం ఏపీఎండీసీకి రూ.9వేల కోట్ల బాండ్లపై తప్పుడు ఫిర్యాదుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడాలనుకున్నారు. దీనిని అడ్డుకునేందుకు విదేశాల్లో పనిచేస్తున్న ఉదయ్భాస్కర్ అనే వైకాపా అభిమానితో 200 మెయిల్స్ పెట్టించారు. పెట్టుబడిదారులు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడంతో బుగ్గన, జగన్ ప్రెస్మీట్లు, ఎక్స్లో పోస్టులతో రంగంలోకి దిగారు. అవి వర్కౌట్ కాకపోవడంతో వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డితో న్యాయస్థానంలో పిటిషన్ వేయించారు. ఆ పాచిక కూడా పారకపోవడంతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో ఫిర్యాదు చేయించారు. ఈ కుట్ర వల్ల 4 గంటల్లో రావాల్సిన ఆర్థికపరమైన అనుమతులు 15 రోజుల ఆలస్యంగా వచ్చాయి. ఏ తప్పూ చేయలేదు కాబట్టి విచారణ పూర్తవ్వాలని వేచి చూశాం. జగన్ హయాంలో తాకట్టుపెట్టి మరీ రుణాలు తీసుకున్న జాబితా బయటపెట్టాలా? సెబీ, ఆర్బీఐ ఇప్పుడు ఇచ్చిన క్లీన్చిట్పై వైకాపా నేతలు ఏం సమాధానం చెబుతారు?'' అని మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పయ్యావుల తెలిపారు. రాష్ట్రం బాగుండాలని ఉద్యోగులు పడిన తపన, వాళ్లు చేసిన పోరాటాలు తమకు తెలుసన్నారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు : మంత్రి పయ్యావుల
July 08, 2025
0
Tags