మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తొలి షోరూంను మంగళవారం ప్రారంభించింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరై మాట్లాడుతూ ''టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ఈ కంపెనీ కార్ల డిజైన్, ఇన్నోవేషన్పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. 2015లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తొలిసారి టెస్లా కారులో తిరిగాను'' అని ఫడణవీస్ మాట్లాడారు. భారత్లో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 'మోడల్ వై' కారును సంస్థ ఆవిష్కరించింది. తొలుత 'మోడల్ Y' ఈవీలను టెస్లా భారత మార్కెట్లో విక్రయించనుంది. ఆర్డబ్ల్యూడీ వెర్షన్ 'మోడల్ వై' ధర రూ. 61.07 లక్షలుగా (ఆన్రోడ్) నిర్ణయించింది. లాంగ్-రేజ్ వెర్షన్ ధర రూ.69.15లక్షలుగా ఉంది. బేస్ మోడల్ ధర అమెరికాలో 44,990 డాలర్లు (రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57లక్షలు) జర్మనీలో 44,970 యూరోలు (రూ.46.09లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్లో దీని ధర ఎక్కువగా ఉంది. కొన్నిరోజుల క్రితం భారత్ రోడ్లపై 'మోడల్ Y' ను పరీక్షించిన సంగతి తెలిసిందే. ముంబయి-పుణే జాతీయ రహదారిపై ఈ వాహనం దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది. ఇది పూర్తిగా అప్డేట్ అయిన మోడల్ Y కారుగా నిపుణులు గుర్తించారు. దీని కోడ్నేమ్ జునిపెర్. సాధారణ మోడల్ Y కంటే దీనిలో ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. అమెరికా, కెనడా మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. దీని సీషేప్లోని ఎల్ఈడీ లైట్లు, ట్విన్ స్పోక్ అలాయ్ వీల్స్, టెస్లా ప్రత్యేకతను తెలిపే గ్లాస్ రూఫ్ ఉన్నాయి. ఇది భారత్లో ఆరు రంగుల్లో లభించవచ్చని భావిస్తున్నారు.
ముంబైలో టెస్లా తొలి షోరూమ్ ప్రారంభం
July 15, 2025
0
Tags