ఇండోనేషియాలో ఫెర్రీ జలసమాధి : నలుగురు మృతి, 38 మంది గల్లంతు

Telugu Lo Computer
0


ఇండోనేషియాలోని తూర్పు జావాలోని బన్యువాంగి జిల్లాలోని కెటపాంగ్ పోర్ట్ నుంచి బాలి ద్వీపంలోని గిలిమానుక్ పోర్ట్‌కు వెళ్లే దాదాపు ఐదు కిలోమీటర్ల సముద్ర మార్గంలో ఓ ఫెర్రీ మునిగిపోయింది. ఫెర్రీ బయలుదేరిన 25 నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయిందని సమాచారం. ఈ మార్గం ఇండోనేషియాలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటిగా చెబుతున్నారు. బలమైన గాలులు, 2.5 మీటర్ల ఎత్తైన అలలు, తీవ్రమైన ప్రవాహాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు తెలిపారు. ఫెర్రీ మునిగిపోవడానికి ప్రతికూల వాతావరణమే కారణమని భావిస్తున్నారు. ఈ ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాకుండా 22 వాహనాలు, వాటిలో 14 ట్రక్కులు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రయాణికులు లైఫ్ బోట్లు ఉపయోగించి తమను తాము కాపాడుకోగలిగారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో రక్షణ బృందాలు, నౌకాదళం, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో విదేశీ పర్యటనలో ఉన్నా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని కేబినెట్ కార్యదర్శి తెలిపారు. ఫెర్రీల్లో ప్రయాణికుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉండడం ఇండోనేషియాలో సాధారణ విషయమని రెస్క్యూ అధికారులు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)